ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కోట్ల
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని అలేబాద్ తాండ గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ఆయన పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా పరిస్థితులు, వసతి సౌకర్యాలు, భోజన ఏర్పాటు, మౌలిక వసతుల పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.ఎమ్మెల్యే విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. బోధనా సిబ్బందితో సమావేశమై పాఠశాల పనితీరు, విద్యార్థుల హాజరు, విద్యా నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలను త్వరలోనే అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.అదనంగా, గిరిజన విద్యార్థుల చదువు, వసతి, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరిశీలన అనంతరం ఎమ్మెల్యే పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరావు యాదవ్, తేదేపా మండల కన్వీనర్ సుదర్శన్, తెదేపా నాయకులు అదే బాద్ పరమేష్, మాధవరం స్వామి, రామకృష్ణ రెడ్డి, బిజెపి నాయకులు కెసి మద్దిలేటి, మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

