ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ‘నిషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రతిజ్ఞ కార్యక్రమం
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ‘నిషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, భారత యువతే దేశ భవిష్యత్తని, ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు, డ్రగ్స్ వంటి వ్యసనాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని, ఒక్కసారి వాటికి బానిసైతే చదువు, ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తు అన్నీ దెబ్బతింటాయని వివరించారు.2047 నాటికి భారతదేశాన్ని పూర్తిగా మాదకద్రవ్య రహిత దేశంగా తీర్చిదిద్దడమే ‘నిషా ముక్త్ భారత్ అభియాన్’ లక్ష్యమని, దీనిని సాధించడంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని, ఈ మార్పు కళాశాల స్థాయి నుంచే ప్రారంభం కావాలని విద్యార్థులకు సూచించారు.అనంతరం విద్యార్థులతో ‘నిషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఇతరులను కూడా వాటి బారిన పడకుండా చైతన్యపరుస్తామని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తూ దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన పాటి, అధ్యాపకులు అనంతలక్ష్మి, వెంకటరమణ, ముస్తాక్, ఓబులేసు, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, శంకరయ్య, మురళీమోహన్, సురేష్, మంజునాథ్, వన్నూర్తో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.



