ఈనెల 5న జాతీయ లోక్ అదాలత్
1 min read

4633 రాజీకాదగిన కేసులను గుర్తించాం
కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
కక్షీదారులకు జిల్లా జడ్జ్ ఎస్. శ్రీదేవి విజ్ఞప్తి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ఉమ్మడి పశ్చిమ గోదావరి జిలాల్లోని అన్ని కోర్ట్ లలో ఈనెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జ్ శ్రీమతి ఎస్.శ్రీదేవి చెప్పారు. స్థానిక కోర్ట్ ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశపు హాలులో బుధవారం ఈనెల 5వ తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లను పాత్రికేయుల సమావేశంలో జిల్ జడ్జ్ తెలియజేసారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ శ్రీదేవి మాట్లాడుతూ రాజీ అయ్యే కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కారం చేసుకోవచ్చన్నారు. గత మార్చ్, 8వ తేదీన ఈ సంవత్సరంలో మొదటి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, 5 వేల కు పైగా సివిల్, క్రిమినల్ కేసులు సదరు జాతీయ లోక్ అదాలత్ లోపరిష్కారమయ్యాయన్నారు.ఈనెల 5వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిలాల్లోని అన్ని కోర్ట్ లలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 4633 రాజీకాదగిన కేసులు గుర్తించామని, వీటిలో 1891 క్రిమినల్, 2501 సివిల్, 241 ఇతర కేసులు ఉన్నాయన్నారు. రాజీకాదగిన కేసులను గుర్తించి లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కక్షీదారులకు న్యాయవాదుల ద్వారా అవగాహన కలిగించాలని జిల్లాలోని బార్ అసోసియేషన్ అధ్యక్షులను కోరడం జరిగిందన్నారు. కోర్ట్ కేసులలో ఒకరి గెలిస్తే, ఒకరు ఓడినట్లని, కానీ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయ్యే కేసులలో కక్షీదారులు ఇద్దరూ గెలిచినట్లేనని, కేసు పరిష్కారం ఐన తరువాత ఇరు పార్టీల వారు సంతోషంతో ఇంటికి వెళ్తారన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను కక్షీదారులందరూ వినియోగించుకుని తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణకు జిల్లాలో 34 బెంచ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత సంవత్సరంలో రెండవ సారి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రస్తుత సంవత్సరంలో గత మార్చ్, 8వ తేదీన మొదటి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించి, 5 వేల కు పైగా కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకుని డబ్బు, సమయం ను ఆదా చేసుకోవాలని కక్షీదారులకు రత్నప్రసాద్ సూచించారు. దూర ప్రాంతాల నుండి రాలేని కక్షీదారులు ఆన్లైన్ ద్వారా కూడా తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం , ప్రభృతులు పాల్గొన్నారు.

