పీఎం సూర్య ఘర్ పనుల్లో నిర్లక్ష్యం విడనాడండి
1 min read
లక్ష్యాల సాధనలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం అమలులో పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి మండల స్థాయి విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్, డీఈలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ మరియు కుసుమ్ పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాకు కేపెక్స్ మరియు యూఏఎం మోడళ్ల కింద కలిపి 51 వేల లక్ష్యాలు కేటాయించగా, ఇప్పటివరకు కేవలం 4,047 పనులు మాత్రమే పూర్తవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కేపెక్స్ మోడల్ కింద 22,655 అప్లికేషన్లు, యూఏఎం మోడల్ కింద 28,326 అప్లికేషన్లు నమోదైనప్పటికీ, పురోగతి సాధించలేకపోయారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు చేరువై అవగాహన కల్పించడం, లబ్ధిదారులతో ప్రత్యక్ష సమన్వయం కల్పించడం, బ్యాంకు రుణ సదుపాయాలు మరియు విద్యుత్ కనెక్షన్ ప్రక్రియలను వేగవంతం చేయడంలో అధికారులు పూర్తి శ్రద్ధ వహించాలన్నారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు.నంద్యాలతో పాటు ఆత్మకూరు రూరల్లో 3,734 లక్ష్యాలకు గాను కేవలం 62 మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. వెండర్లతో సమన్వయం పెంచి, లబ్ధిదారులకు బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చి, విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను గట్టిగా ఆదేశించారు.

