కైరుప్పల గ్రామంలో దళితుల భూములకు రక్షణ కల్పించాలి
1 min read
డి హెచ్ పి ఎస్ డిమాండ్
అక్రమ పట్టాలు రద్దు చేసి, 40 సంవత్సరాల నుండి సాగు చేసుకొని జీవనం చేస్తున్న దళితులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం ఎదుట దళితుల ధర్నా
న్యూస్ నేడు, పత్తికొండ: ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలోని సర్వే నెంబర్ 578 లో గత 40 సంవత్సరాలుగా భూమిని నమ్ముకుని సాగు చేసుకుంటున్న 12మంది దళిత కుటుంబాలకు పట్టాలు ఇవ్వకుండా కుట్రలు పన్నుతున్నారని, అక్రమంగా పట్టాలు పొందిన ఆస్పరికి చెందిన రాజగోపాల్పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక ఆర్డీవో కార్యాలయం ముందు గురువారం డి.హెచ్.పి.ఎస్ ఆధ్వర్యంలో బాధితులతో కలసి భారీగా ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి డిహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు ఆర్. గురుదాసు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే.తిమ్మయ్య డి హెచ్ పి ఎస్ తాలూకా అధ్యక్షులు హెచ్.రంగన్నలు మాట్లాడుతూ, కైరుప్పల గ్రామంలోని సర్వే నెంబర్ 578 లో 12 దళిత కుటుంబాలు తమ చెమటను చిందిస్తూ 40 ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటున్నారని తెలిపారు. పట్టాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ నలభై సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వాపోయారు. భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు రాకుండా అడ్డుపడి, ఆస్పరి గ్రామానికి చెందిన రాజగోపాల్ అనే వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పట్టాలు సృష్టించుకున్నాడని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆ భూమిని బిల్లెకల్ గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేష్ అనే వ్యక్తికి అమ్మి, గొడవలు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వారన్నారు.


