అగ్రి ల్యాబ్ తరలింపు సమంజసం కాదు – ఆలూరు ఎమ్మెల్యే
1 min read
ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు మార్కెట్ యార్డ్లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి మాట్లాడుతూ, ఆలూరులో ఉన్న అగ్రి ల్యాబ్ను ఆదోనికి తరలించే నిర్ణయం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని తీవ్రంగా ఆక్షేపించారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సేవలు అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్రి ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆలూరు నియోజకవర్గానికి కేటాయించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అగ్రి ల్యాబ్ భవనాన్ని సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించి, 2021 జూలై 8న ప్రారంభించారని గుర్తుచేశారు.ఆలూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటని, ఇక్కడి రైతులు ప్రధానంగా వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతంలో రైతులకు నేల, నీటి పరీక్షలు, వ్యవసాయ సలహాలు అందించే అగ్రి ల్యాబ్ ఎంతో అవసరమని అన్నారు.అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ అగ్రి ల్యాబ్ను ఆలూరు నుంచి ఆదోనికి తరలించే ఉత్తర్వులు జారీ చేయడం బాధాకరమని విమర్శించారు. ఇప్పటికే కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని నిరుపయోగంగా మార్చడం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం, అధికారులు ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఆలూరు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అగ్రి ల్యాబ్ తరలింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆలూరులోనే కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో నియోజకవర్గ రైతులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, బీవీఆర్ అభిమానులు మరియు రైతులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ : ఆలూరు అగ్రి ల్యాబ్ తరలింపుపై ఎమ్మెల్యే విరుపాక్షి ఆగ్రహం, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయం: బుసినే విరుపాక్షి, ఆలూరు నుంచి ఆదోనికి అగ్రి ల్యాబ్ తరలింపును వెంటనే నిలిపివేయాలి. ల్యాబ్ తరలిస్తే రైతులతో కలిసి ఉద్యమం చేస్తాం: ఎమ్మెల్యే హెచ్చరికరూ.1.50 కోట్లతో నిర్మించిన అగ్రి ల్యాబ్ను ఎందుకు తరలిస్తున్నారు?


