ప్రజా సమస్యల పరిష్కారమే ఎస్డీపీఐ లక్ష్యం
1 min read
ఆకలి నుంచి స్వేచ్ఛ.. భయం నుంచి స్వేచ్ఛే నినాదం
ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి
హోళగుంద న్యూస్ నేడు: ప్రజల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నిరంతరం ప్రజల మధ్య పనిచేస్తోందని ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ తెలిపారు.ప్రజలకు ఏ సమస్య వచ్చినా సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. మండలంలోని వివిధ గ్రామాలు, వార్డుల్లో పర్యటిస్తూ డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
వర్షాకాలంలో డ్రైనేజీలు, మురుగు కాలువలు శుభ్రంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అబ్దుల్ హమీద్ కోరారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రజల సమస్యే పార్టీ సమస్య
పేదలు, కార్మికులు, మహిళలు, యువత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం జరిగే వరకు ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. సమస్యలపై అధికారులు స్పందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేపడతామని స్పష్టం చేశారు.ప్రజలు తమ ప్రాంతంలోని సమస్యలను ఎస్డీపీఐ నాయకులు, కార్యకర్తల దృష్టికి తీసుకురావాలని కోరారు. “ఆకలి నుండి స్వేచ్ఛ – భయం నుండి స్వేచ్ఛ” అనే నినాదంతో ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఎస్డీపీఐ మరింతగా ప్రజల మధ్య పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కే. సలాం, కార్యదర్శి కే. అబ్దుల్ రెహ్మాన్, ప్రధాన కార్యదర్శి ఎం. హఫీజ్, కోశాధికారి బి. అల్లా బకాష్ తదితరులు పాల్గొన్నారు.


