ఏపీలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు ఏర్పాటు చేయండి
1 min read
ఇండస్ట్రియల్ పార్కుల్లో డీశాలినేషన్ ప్లాంట్లు పెట్టండి
రోసాటమ్ ప్రతినిధులతో భేటీలో ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలు
సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా) న్యూస్ నేడు : రష్యాకు చెందిన గ్లోబల్ నూక్లియర్ టెక్నాలజీ లీడర్ రోసాటమ్ (Rosatom) డైరెక్టర్ (ఐటీ & డిజిటలైజేషన్) అబాకుమోవ్ ఎవ్ జెనీ (Mr Abakumov Evgeny), ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ క్వ్యాట్కోవ్స్కీ ఎగోర్ (Mr Kvyatkovsky Egor)తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఖాళీగా ఉన్న తీరప్రాంత భూమిని ఉపయోగించి, భారతదేశంలోని భారీ పారిశ్రామిక జోన్లకు స్వచ్ఛమైన, 24/7 క్యాప్టివ్ విద్యుత్ను అందించడానికి, తదుపరి తరం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను (SMRలను) ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు రావాలని ఆహ్వానించారు. భారతదేశ ఫార్మా రంగాన్ని, వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడానికి, సిద్ధంగా ఉన్న ప్లగ్-అండ్-ప్లే స్థలాన్ని ఉపయోగించుకుని, ఒక న్యూక్లియర్ మెడిసిన్, ఫుడ్ ఇర్రాడియేషన్ సెంటర్ స్థాపించాలని కోరారు. ఏపీ మెగా ఇండస్ట్రియల్ పార్కుల్లో ఒక న్యూక్లియర్ డీశాలినేషన్ ప్లాంట్ను నిర్మించేందుకు చొరవ చూపించాలని ప్రతిపాదించారు. భారతదేశ ఏరోస్పేస్, రక్షణ రంగాలకు నేరుగా అనుసంధానించేలా, మినరల్ బెల్ట్/కారిడార్ పరిధిలో న్యూక్లియర్-గ్రేడ్ మిశ్రమ లోహాలు, కార్బన్-ఫైబర్ కాంపోజిట్ల తయారీ యూనిట్ను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.రోసాటమ్ డైరెక్టర్ అబాకుమోవ్ ఎవ్ జెనీ మాట్లాడుతూ… తమ సంస్థ భారత్ లో ఢిల్లీ కేంద్రంగా న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL)తో కలిసి భారత్-రష్యా అణుశక్తి ఒప్పందాలు, ఇంజనీరింగ్ కాంట్రాక్టులు, పరికరాల స్థానికీకరణను నిర్వహిస్తుందని తెలిపారు. అధునాతన VVER-1000 రియాక్టర్లు, అణు ఇంధనం, జీవితకాల సాంకేతిక మద్దతును సరఫరా చేయడం ద్వారా ప్రతిష్టాత్మకమైన కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తుందని వివరించారు. భారీ పారిశ్రామిక విడిభాగాలు, వాల్వ్లు, పవన శక్తి పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి రోసాటమ్ భారతీయ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని వివరించారు. మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.

