ధవళేశ్వరంలో వైభవంగా శ్రీ శ్రీదేవి పోలేరమ్మ జాతర మహోత్సవాలు
1 min read
పట్టువస్త్రాలు సమర్పించిన ఆలయ ధర్మకర్త యం. రాజుబాబు
ధవళేశ్వరం, న్యూస్ నేడు : ధవళేశ్వరంలోని శ్రీ శ్రీదేవి పోలేరమ్మ వారి జాతర మహోత్సవాలు మూడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించబడ్డాయి. జూన్ 7 నుండి 9వ తేదీ వరకు జరిగిన ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతర మహోత్సవాల్లో భాగంగా జూన్ 7, 8 తేదీలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జూన్ 9వ తేదీన ప్రధాన జాతర ఉత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది.ఉదయం 8 గంటలకు ఆలయ ధర్మకర్త యం. రాజుబాబు శ్రీమతి యం. సాయి లక్ష్మీ దంపతులు పట్టువస్త్రాలు, ఆభరణాలను ఘన ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శ్రీ యం. రాజుబాబు మాట్లాడుతూ ఉదయం నుంచే భక్తులు బోనాలు, మొక్కుబడులతో పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడం జరిగిందని, జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. ధవళేశ్వరం మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.మధ్యాహ్నం 3 గంటలకు పోలేరమ్మ అమ్మవారిని ఊరేగింపుగా గోదారమ్మ వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త యం. రాజుబాబు సతీమణి శ్రీమతి యం. సాయి లక్ష్మీ ఆధ్వర్యంలో మహిళలకు పసుపు, కుంకుమ, గాజుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.సాయంత్రం 6 గంటల నుండి డప్పుల వాయిద్యాలు, కోలాటాలు, సాంప్రదాయ కళారూపాలు, వివిధ వేషధారణలు, నృత్య ప్రదర్శనలు మరియు విద్యుత్ దీపాలంకరణల నడుమ జాతర ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. ఈ ఊరేగింపు జాతరకు వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.జాతర మహోత్సవాల విజయవంతం గా నిర్వహించిన శ్రీ శ్రీదేవి పోలేరమ్మ కమిటీ సభ్యులకు, సహకరించిన గ్రామ పెద్దలు, భక్తులు, దాతలకు ఆలయ ధర్మకర్త శ్రీ యం. రాజుబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



