శ్రీశైలం నీటిని సంరక్షించి రాయలసీమ సాగు, త్రాగునీటి హక్కులను కాపాడాలి
1 min read

కేసి కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి.
జిల్లా కలెక్టర్ కి బొజ్జా దశరథరామిరెడ్డి వినతి
నంద్యాల, న్యూస్ నేడు: శ్రీశైలం ప్రాజెక్టు జల నిర్వహణపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి సవివరమైన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సమితి ఉపాధ్యక్షులు యర్రం శంకర రెడ్డి, కార్యవర్గ సభ్యులు నిట్టూరు సుధాకర్ రావుతో కలిసి మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సమావేశమై రాయలసీమ హక్కులకు సంబంధించిన పలు జీ.ఓలు మరియు కీలక అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.కేసీ కెనాల్కు సంబంధించి అమల్లో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు, బచావత్ ట్రిబ్యునల్ నిబంధనలు మరియు రాష్ట్ర విభజన చట్టంలోని విధానాలను వివరిస్తూ వాటిని పరిగణలోకి తీసుకుని నీటి విడుదలపై తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.సాగునీటి సలహా మండలి సమావేశానికి ముందుగానే రైతులు విస్తృతంగా రబి పంటలు సాగు చేసిన నేపథ్యంలో, కేసీ కెనాల్ ఆయకట్టుకు ముచ్చుమర్రి మరియు మల్యాల ఎత్తిపోతల పథకాల ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి పంటలను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, కేసీ కెనాల్కు మరో తడవ నీటి విడుదల చేపడతామని ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి హామీ ఇచ్చారు.

