మొహరం (పీర్ల) పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి
1 min read
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల ప్రజలకు ఎస్సై దిలీప్ కుమార్ సూచనలు హోళగుంద మండలంలో నిర్వహించనున్న మొహరం (పీర్ల) పండుగ సందర్భంగా ప్రజలు శాంతి, సామరస్య వాతావరణంలో పండుగను జరుపుకోవాలని హోళగుంద పోలీస్ స్టేషన్ ఎస్సై దిలీప్ కుమార్ సూచించారు. పండుగ నిర్వహించే ప్రతి గ్రామానికి చెందిన ముజావర్లు, గ్రామ పెద్దలు ముందస్తుగా పోలీస్ స్టేషన్కు వచ్చి అవసరమైన అనుమతులు పొందాలని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండుగ కార్యక్రమాలు పరస్పర గౌరవం, మత సామరస్యంతో నిర్వహించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే గొడవలు, వాగ్వాదాలు, కొట్లాటలకు దూరంగా ఉండాలని సూచించారు.సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు, పుకార్లు, అభ్యంతరకర పోస్టులు లేదా సందేశాలు ప్రచారం చేయరాదని, అలాంటి చర్యలు చట్టపరమైన సమస్యలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. పండుగల పేరుతో పచ్చని చెట్లు నరకడం, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం చేయరాదని స్పష్టం చేశారు.మద్యం సేవించి లేదా మత్తు పదార్థాల ప్రభావంలో పండుగ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, ప్రజల భద్రత దృష్ట్యా డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్లకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. రోడ్లపై అడ్డంకులు సృష్టించకుండా అత్యవసర వాహనాల రాకపోకలకు సహకరించాలని కోరారు.పండుగ సందర్భంగా అలయ్ ఆడే సమయంలో కర్రలు, కత్తులు, ఆయుధాలు లేదా ఇతర ప్రమాదకర వస్తువులు వెంట తీసుకురావద్దని సూచించారు. గ్రామ పెద్దలు, మత పెద్దలు, యువకులు పోలీసు శాఖకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి మొహరం (పీర్ల) పండుగను ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా జరుపుకోవాలని ఎస్సై దిలీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పై సూచనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

