కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలోని అన్ని బ్యాంకు ఎటీఎంల వద్ద రాత్రి వేళల్లో గట్టి నిఘా కొనసాగుతుందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు.ఇటీవల కాలంలో ఎటీఎంలలో నగదు చోరీలు, కార్డు స్కిమ్మింగ్, సైబర్ మోసాలు మరియు ఇతర నేర కార్యకలాపాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎటీఎంలను తరచూ తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.బ్యాంకు నిర్వాహకులు ఎటీఎంల వద్ద సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు, భద్రతా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు ఎటీఎంలను ఉపయోగించే సమయంలో తమ పిన్ నంబర్ను గోప్యంగా ఉంచుకోవాలని, అపరిచితుల సహాయం తీసుకోకూడదని సూచించారు.ఏవైనా అనుమానాస్పద పరికరాలు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-112 /100 కు సమాచారం అందించాలని కోరారు.