టాప్ జ్యుయలరీ సంస్థలు.. మంగళగిరిలోనే..
1 min read
దేశంలోనే అత్యుత్తమంగా మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు!
ప్రతిఏటా 4వేలమందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ
అధికారులతో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష
అమరావతి , న్యూస్ నేడు: దేశంలో అత్యుత్తమ మోడల్ లో మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటుపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కుతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందులో ఆభరణాల తయారీలో ప్రపంచస్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో టాప్ 20 ఆభరణాల తయారీసంస్థలు మంగళగిరి పార్కులో తయారీ యూనిట్లు, రిటైల్ షాపులు స్థాపించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
ఎంసీసీని త్వరగా ఏర్పాటు చేయండి …
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరిలో యువతకు నైపుణ్యశిక్షణ అందించే మోడల్ కెరీర్ సెంటర్ (ఎంసిసి)ను కూడా త్వరితగతిన ఏర్పాటు చెయ్యాలని అన్నారు. ఎంసిసి ద్వారా కెరీర్ కోచింగ్, జాబ్ మ్యాచింగ్, స్కిల్ అప్ గ్రేడేషన్, ఎంప్లాయర్ ఎంగేజ్ మెంట్ చేపట్టాలని అన్నారు. మంగళగిరిలో ఇప్పటివరకు చేపట్టిన 3 జాబ్ ఫెయిర్లకు 1170మంది యువకులు హాజరుకాగా, 453మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ… ఇకపై ప్రతినెలా జాబ్ ఫెయిర్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, యువతకు నూరుశాతం ఉద్యాగాలు కల్పించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిఇఓ గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కె.రఘు, అసోసియేట్ డైరక్టర్ పురుషోత్తమ్ తదితరులు పాల్గొన్నారు.

