యూనివర్సిటీ కళాశాలస్థాయి వక్తృత్వ పోటీలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నేటి పోటీప్రపంచంలో నైపుణ్యాలుంటేనే మనుగడ సాగించగలమని జన విజ్ఞానవేదిక బాధ్యులు, విశ్రాంత అధ్యాపకులు సి. రమేష్ అభిప్రాయపడ్డారు. జనవిజ్ఞానవేదిక, రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ సెనేట్ హాలులో నిర్వహించిన యూనివర్సిటీ కళాశాలస్థాయి వక్తృత్వ పోటీలు “వక్త – 2025” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో నిగూఢంగా దాగిఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి జనవిజ్ఞానవేదిక తరపున చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. ఒకప్పుడు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేవని, కానీ నేడు ఎంతచదువుకున్నా ఉద్యోగానికి హానీలేకుండా పోతోందన్నారు. ప్రాబ్లంసాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, సాఫ్ట్ స్కిల్స్ మొదలైనవి ఆధునిక అవసరాలుగా మారిపోయాయన్నారు. కంఫర్ట్ జోన్లోనే ఉంటూ కలలు కంటుంటే లాభంలేదని ప్రతిఒక్కరూ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నపుడే రాణించగలుగుతారని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమస్త సృష్టిలో మాట్లాడే నైపుణ్యం మనిషికి మాత్రమే సొంతంకాబట్టి ఆ మాటను ఎంత అందంగా, ఆకర్షణీయంగా, సందర్భశుద్ధితో విషయప్రధానంగా మాట్లాడటంపట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు. కళాశాల స్థాయిలో విజేతలకు ఈ నెల 25వ తేదీన జిల్లాస్థాయిలోను, అందులో విజేతలుగా నిలిచినవారికి 28వ తేదీన గుంటూరులో రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తామన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకటబసవరావు ఆదేశాలమేరకు వర్సిటీలో ఎన్ఎస్ఎస్ తరపున ఈ కార్యక్రమంలో వర్సిటీ NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. వెంకటరత్నం, డాక్టర్ బి. విజయుడు, డాక్టర్ కె. నాగచంద్రుడు, బి. శివప్రసాదరెడ్డితో పాటు జనవిజ్ఞానవేదిక తరపున వక్త కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు డి.యం.హెచ్. బాషా. కె. ప్రతాప్ రెడ్డి, సురేష్ తదితరులతోపాటు విద్యార్థినీ విద్యార్థులు, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

