వివిధ పరికరాలను 70 మంది విభిన్న ప్రతిభావంతులకు పంపిణీ
1 min read

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఇప్కో- టోక్యో సంస్థ అందజేసిన సిఎస్ఆర్ ఫండ్స్ తో 70 మంది విభిన్న ప్రతిభావంతులకు పరికరాల పంపిణీ
ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: సమాజంలో నిరాధరణకు గురయ్యేవారికి భారీ ఖర్చుతో కూడిన సేవలు అందించడం నిజమైన సేవకు ప్రతిరూపంగా నిలుస్తుందని, ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే వారిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్, టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాలను మరింత శక్తివంతంగా నిర్వహించేందుకు తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఏలూరు సమీపంలోని దొండపాడులో ఉమా ఎడ్యుకేషనల్, టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇఫ్కో – టోక్యో సంస్థ అందజేసిన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కొనుగోలు చేసిన వివిధ పరికరాలను 70 మంది విభిన్న ప్రతిభావంతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపి పుట్టా మహేష్ మాట్లాడుతూ భారీ ఖర్చుతో కూడుకున్న సేవా కార్యక్రమాలను చేయాలనుకునే మంచి మనసుతో పాటూ,,, చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే దృఢ సంకల్పం కూడా కలిగి ఉండడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలోని ఎంతో మందికి ఉపయుక్తంగా నిలవడంతో పాటూ మరింతమందిలో స్ఫూర్తిని కలిగిస్తాయన్న ఎంపి పుట్టా,,,, భవిష్యత్తులో అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యంతో ఒక సంస్థను ఏర్పాటుచేసి, దాన్ని సమున్నత భావాలతో ఆదర్శవంతంగా నిర్వహించడంతో పాటూ సేవలను బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్ళడమెంతో అభినందనీయమన్నారు. సొసైటీ నిర్వాహకుల సేవలను ప్రస్తుతించిన ఆయన,,, ఎటువంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందించేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం 30 మంది దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, 25 మందికి వీల్చైర్లు, 8మందికి కృత్రిమ కాళ్ళను అందజేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, డివిజన్ ల ఇంచార్జ్ లు సోమిశెట్టి రాము ,చేకూరి గణేష్ ఉమా ఎడ్యుకేషనల్, టెక్నికల్ సొసైటీ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ పెద్దిరెడ్డి, జాయింట్ డైరెక్టర్ ఎస్వీఎస్ఎన్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


