ఆర్థిక ఇబ్బందులు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం.. రాష్ట్ర మంత్రి
1 min read

42వ వార్డులో వార్డు పర్యటన చేపట్టిన మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: ఆర్థిక ఇబ్బందులు అధిగమించి సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. కర్నూలు నగరంలోని 42వ వార్డులో ఆయన వార్డు పర్యటన చేపట్టి ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలిసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. ఈ వార్డులో మొత్తం 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామన్నారు. మరో కోటిన్నర రూపాయల పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వం పింఛన్ ఇస్తుందని ప్రజలతో చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ముందున్నారన్నారు. కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా చేపట్టి ముందుకు తీసుకెళుతున్నట్లు మంత్రి టీజీ భరత్ ప్రజలతో చెప్పారు. ప్రజలకు వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న తమ నాయకుల ద్వారా తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. పర్యటనలో యువతను కలిసి ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళా లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తం అవుతోందన్నారు. వార్డుల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, టిడిపి నేతలు, బూత్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.


