పెట్రోల్–డీజిల్ కొరతపై ఎల్లార్తి గ్రామంలో వైసీపీ నిరసన
1 min read
హోళగుందన్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ఈ నిరసనకు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.కె. గిరి నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా యస్.కె. గిరి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులు ఇంధనం లేక పనులు చేయలేక కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సులభంగా లభిస్తున్నప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం కొరత నెలకొనడం దురదృష్టకరమని విమర్శించారు.ప్రజలు పెట్రోల్ బంక్ల వద్ద క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి ఇంధనం పొందాల్సి వస్తోందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆయిల్ కంపెనీలతో కుమ్మక్కై ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు.అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్, రేషన్, యూరియా వంటి అవసరాల కోసం కూడా ప్రజలు క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని మండిపడ్డారు. వెంటనే పెట్రోల్, డీజిల్ కొరత నివారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో గంగాధర్, ఖాసీం, మల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

