మెడికవర్ హాస్పిటల్స్ లో యోగా కార్యక్రమం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యతను తెలియజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని యోగా సాధన చేశారు.ఈ కార్యక్రమానికి కర్నూలు మున్సిపల్ కమిషనర్ శ్రీ చల్లా ఓబులేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి మార్గదర్శకం. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా పొందవచ్చు. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్న ఈ రోజుల్లో యోగా ప్రతి ఒక్కరికీ అవసరం” అని తెలిపారు.అలాగే ఆసుపత్రి సిబ్బంది యోగాపై చూపిన ఆసక్తిని మరియు చురుకైన భాగస్వామ్యాన్ని ఆయన అభినందించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా యోగా శిక్షకుడు మంజునాథ్ రెడ్డి వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను ప్రదర్శిస్తూ వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. శరీర సౌష్టవం, శ్వాసకోశ ఆరోగ్యం, మానసిక ఏకాగ్రత మరియు ఒత్తిడి నియంత్రణలో యోగా ఎలా సహాయపడుతుందో పాల్గొన్న వారికి ప్రాక్టికల్గా చూపించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది యోగా సాధన ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అంశాలపై అవగాహన పొందారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “యోగా మన భారతీయ సంస్కృతిలో భాగమైన అమూల్యమైన ఆరోగ్య సంపద. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది. మా ఉద్యోగుల శారీరక, మానసిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది” అని తెలిపారు.


