అన్న వాహిక’లో.. గట్టిబడిన కండరం..
1 min read

ఆహారం మింగుడు పడక… బరువు తగ్గిపోయిన బాలుడు
* అత్యంత అరుదైన అకలేషియా కార్డియా అనే సమస్య
* అన్నవాహిక కింది భాగంలో గట్టిబడిన కండరం
* దానివల్లే ఏమీ మింగలేని పరిస్థితి
* శస్త్రచికిత్సతో నయం చేసిన కిమ్స్ సీతమ్మధార వైద్యులు
విశాఖపట్నం, న్యూస్ నేడు: పదేళ్ల బాలుడు రెండు సంవత్సరాలుగా ఏదీ సరిగ్గా మింగలేకపోతున్నాడు. అన్నం తినలేకపోవడంతో అతడు నాలుగు కిలోల బరువు తగ్గిపోయాడు. ఎంతమంది వైద్యులకు చూపించినా సమస్య ఏంటన్నది సరిగా అర్థం కాలేదు. దాంతో చివరకు సీతమ్మధారలోని కిమ్స్ ఆస్పత్రికి ఆ బాలుడిని అతడి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఇక్కడ ఆ బాలుడికి చికిత్స చేసిన ఆస్పత్రికి చెందిన చీఫ్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. చలపతిరావు ఆచంట ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “ఇక్కడకు వచ్చిన ఆ బాలుడికి ముందుగా ఎండోస్కొపీ, తర్వాత మానోమెట్రీ అనే పరీక్షలు చేశాం. దాంతో అతడికి అకలేషియా కార్డియా అనే అత్యంత అరుదైన సమస్య ఏర్పడిందని తేలింది. ఆ కుటుంబ సభ్యులకు దాని గురించి వివరించాం. ఆహారనాళం దిగువన ఉండే కండరం బాగా బిగుతుగా అయిపోయి, గట్టిబడిపోతుంది. దానివల్ల అతడు ఏం తిన్నా కడుపులోకి వెళ్లదు, అసలు ఘన పదార్థాలు ఏవీ మింగలేడు. దీనికి ఇంటర్వెన్షనల్ ఎండోస్కొపీ చికిత్సలలో భాగంగా అత్యంత అధునాతనమైన పెర్ ఓరల్ ఎండోస్కొపిక్ మయోటోమి (పొయెమ్) అనే చికిత్స ఉంది. దీనికి శరీరం మీద ఎలాంటి కోతలు పెట్టాల్సిన అవసరం లేదు. నోటి గుండానే ఎండోస్కోపీ పంపి దాని ద్వారా చికిత్స చేయొచ్చు. ఈ పద్ధతి గురించి అతడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి, విజయవంతంగా చికిత్స చేశాం. అది పూర్తయిన 24 గంటల్లోనే అతడు నోటి ద్వారా అన్నం తినగలిగాడు. సమస్య తీరిపోవడంతో చికిత్స చేసిన రెండు నెలల తర్వాత మళ్లీ ఫాలో అప్ కోసం వచ్చినప్పుడు చూస్తే, 5 కిలోల బరువు పెరిగాడు.

