అన్న క్యాంటీన్ల ద్వారా రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలి
1 min read

పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి.
కర్నూలు, న్యూస్ నేడు: అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించడంతో పాటు క్యాంటీన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.శనివారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాంటీన్లో భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి, భోజనం నాణ్యత, రుచి, పరిమాణం, సర్వింగ్ విధానం తదితర అంశాలపై ఆరా తీశారు. భోజనాన్ని స్వయంగా రుచి చూసిన కలెక్టర్, భోజనం బాగుందని తెలిపారు. అనంతరం భోజనం చేస్తున్న వారిని ఎక్కడి నుంచి వచ్చారు? భోజనం ఎలా ఉంది? పరిమాణం సరిపోతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భోజనం చేస్తున్న ప్రజలు సానుకూలంగా స్పందించి, అన్న క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచికరంగా ఉందని, నాణ్యత కూడా బాగుందని కలెక్టర్కు తెలియజేశారు. ప్రతి ఒక్కరికీ తగినంత భోజనం అందేలా చూసుకోవాలని, ఎవరూ భోజనం విషయంలో ఇబ్బంది పడకూడదని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. రోజుకు ఎన్ని టోకెన్లు ఇస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించగా, మధ్యాహ్న భోజన సమయంలో సుమారు 750 టోకెన్లు అందిస్తున్నట్లు సిబ్బంది వివరించారు. అలాగే క్యాంటీన్ పరిసరాలు, భోజనం చేసే ప్రాంగణం, సర్వింగ్ ప్రాంతాలు పూర్తిగా శుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్, భోజన తయారీ నుంచి సర్వింగ్ వరకు నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు.

