ఎక్కడా లేని విధంగా ఏపీలో పింఛన్లు అందిస్తున్నాం..
1 min read

నెయ్యిని కల్తీ చేసినందుకే వైసీపీ నేతలు వాదనలకు దిగారు
52వ వార్డులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో పింఛన్లు ఎక్కువ మొత్తంలో ఇవ్వడమే కాకుండా సమయానికి అందజేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 52వ వార్డులోని యస్. నాగప్ప వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి టీజీ భరత్ పంపిణీ చేశారు. వృద్ధులు, మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ 1వ తేదీన సెలవు ఉంటే ముందురోజే పింఛన్లు అందజేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. పింఛన్ దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధివైపు రాష్ట్రాన్ని నడిపించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. దావోస్ పర్యటనలో విశ్రాంతి లేకుండా సమావేశాలు నిర్వహించి రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినట్లు తెలిపారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు. వైసీపీ నేతలు తప్పు చేసి ఇప్పుడు మళ్ళీ అడ్డంగా వాదిస్తున్నారన్నారు. కల్తీ జరిగింది కాబట్టే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు డిఫెన్స్కి దిగారన్నారు. తప్పు చేసిన వారు తిరుమల వెళ్లి వెంకన్న స్వామికి క్షమాపణలు చెప్పాలన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అందరికీ తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

