ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉత్సవ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి
1 min read

ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్
న్యూస్ నేడు పత్తికొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉత్సవ్” పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని జొన్నగిరి గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉత్సవ్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సౌరశక్తి ద్వారా విద్యుత్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.సాధారణ ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సూర్య ఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, అదనపు విద్యుత్ను గ్రిడ్కు అమ్మి ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుందని వివరించారు.గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ప్రజలు ఈ పథకంపై పూర్తి అవగాహన పెంపొందించుకుని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని అన్నారు.ప్రభుత్వ అధికారులు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రతి అర్హుడికి ఈ పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజలు తమ ఇళ్లలో సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వమే ఉచితంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు అందువల్ల ఎస్సీ ఎస్టీ వాళ్లంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఇంజనీర్లు మహేశ్వర్ రెడ్డి, సుజాత, లైన్మెన్ రామదాసు, తదితరులు పాల్గొన్నారు.


