సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్
1 min read

విధులకు గైర్హాజరు అయితే కఠిన చర్యలు
ఆన్లైన్ హాజరు లోపాలపై షోకాజ్ నోటీసులు
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల/బేతంచర్ల, న్యూస్ నేడు: సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు సేవలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. గురువారం బేతంచెర్ల మండలం ఆర్. కొత్తపల్లె గ్రామంలోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది ఆన్లైన్ హాజరు నమోదును పరిశీలించారు. విధులకు హాజరుకాని పంచాయతీ గ్రేడ్-5 సిబ్బంది మరియు వీఆర్వోపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సిబ్బంది ఎవరెవరు ఏ విధులు నిర్వహిస్తున్నారనే అంశంపై కలెక్టర్ వివరణ కోరారు. సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను సమగ్రంగా పరిశీలించి, వాటి నిర్వహణపై సూచనలు ఇచ్చారు. సచివాలయ ఆవరణలో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పబ్లిక్ పర్సెప్షన్ సర్వేలో సాధించిన పురోగతి, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు, వాటిపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారా లేదా అనే అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.రీసర్వేకు సంబంధించి వీఆర్వో, సర్వేయర్ అందుబాటులో లేరని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన సచివాలయ సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే ప్రజా ఫిర్యాదుల విభాగం పనితీరును కూడా కలెక్టర్ సమీక్షించారు.

