అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జీజీహెచ్ సూపరింటెండెంట్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు ఈరోజు ఆసుపత్రిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ముందుగా ఆసుపత్రి ప్రాంగణంలోని న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్ సందర్శించిన ఆయన, అందులోని 3వ మరియు 4వ అంతస్తుల్లో జరుగుతున్న నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న సూపరింటెండెంట్, రోగులకు త్వరితగతిన సేవలు అందించేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను మరియు కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి అంతస్తు బ్లడ్ శాంపిల్స్ విభాగాలను తనిఖీ చేసి, శానిటేషన్ ను మరింత మెరుగుపరచాలని సిబ్బందిని ఆదేశించారు.అనంతరం, ఆసుపత్రిలోని డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ పనులను ఆయన తనిఖీ చేశారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.MCH (మాతృ మరియు శిశు సంరక్షణ) వార్డును సందర్శించిన డాక్టర్ వెంకటేశ్వర్లు , అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.వార్డుల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గర్భిణీలకు మరియు బాలింతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు తో పాటు అడ్మినిస్ట్రేషన్ నుండి డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ శివ బాల, డాక్టర్ సునీల్ ప్రశాంత్, డాక్టర్ క్లింటన్, మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొనడం జరిగింది.

