భూములు పొందిన కంపెనీలు పనులు ప్రారంభించాలి
1 min read

జీ.యం, జెడ్.యంల సమీక్షా సమావేశంలో మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు, న్యూస్ నేడు: పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు బాగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నార్త్ జోన్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు జోన్ల జీయంలు, జెడ్.యంలతో రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్ గుప్తాతో పాటు ఏపీఐఐసీ ఎండీ దినేష్ కుమార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభమ్ బన్సల్, అధికారులు పాల్గొన్నారు. ముందుగా జోన్ల వారీగా వచ్చిన పెట్టుబడులు, పనులు జరుగుతున్న పరిశ్రమల గురించి చర్చించారు. పరిశ్రమల ద్వారా వస్తున్న ఉద్యోగాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని మంత్రి చెప్పారు. పారిశ్రామికపార్కుల్లో ఆక్రమణలు ఉంటే గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. భూములు తీసుకున్న కంపెనీలు పనులు తప్పకుండా ప్రారంభించి ఉండాలన్నారు. లేని పక్షంలో నిబంధనల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు గ్రౌండింగ్ అయ్యేలా క్షేత్ర స్థాయిలో అధికారులు పనిచేయాలని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

