రైతులను మోసం చేసి పరారైన వ్యవసాయ సహాయకుడిపై చర్యలు తీసుకోవాలి
1 min read
రైతుల నుంచి రూ.6.50 లక్షలు వసూలు చేసి పరారైన వ్యవసాయ సహాయకుడిపై చర్యలు తీసుకోవాలి: ఎస్.కే. గిరి
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కే. గిరి మాట్లాడుతూ నేరనికి గ్రామ సచివాలయంలో వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తున్న పరమేశ్ నాయక్ నేరనికి, నేరనికి తండా ప్రాంతాలకు చెందిన రైతుల నుంచి యూరియా ఎరువులు తెప్పిస్తానని చెప్పి సుమారు రూ.6.50 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు.డబ్బులు తీసుకున్న తర్వాత దాదాపు 20 రోజులుగా రైతులకు యూరియా అందించకుండా, తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, విధులకు కూడా హాజరు కాకుండా కనిపించకుండా పోయాడని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వారి కష్టార్జిత సొమ్ము ఏమైందో తెలియక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, పరమేశ్ నాయక్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి వసూలు చేసిన డబ్బులను వెంటనే తిరిగి ఇప్పించి, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రైతులను మోసం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని రైతుల్లో నమ్మకం కల్పించాలని ఎస్.కే. గిరి విజ్ఞప్తి చేశారు.

