కేంద్ర ప్రభుత్వ పథకాలను..పటిష్టంగా అమలు చేయాలి
1 min read

సమన్వయంతో లోపాలను అధిగమించాలి
నంద్యాల కలెక్టర్ రాజకుమారి..
నంద్యాల,న్యూస్ నేడు : జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో అమలవుతున్న పథకాలను పటిష్టంగా అమలు చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పరిశీలించడానికి జిల్లాకు విచ్చేసిన జాతీయ స్థాయి పర్యవేక్షణ కేంద్ర బృందం (నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం) మరియు జిల్లా అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో ఆయా శాఖల ద్వారా అమలవుతున్న వివిధ పథకాలను పరిశీలించడానికి బృంద లీడర్ సంతోష్ ఫరీదా నేతృత్వంలో ఈనెల 19 నుంచి 29(నేటి) వరకు జాతీయ స్థాయి పర్యవేక్షణ కేంద్ర బృందం (ఎన్ఎల్ఎం)జిల్లాలో పర్యటించిందన్నారు. సదరు బృందం జిల్లా నందలి మూడు మండలాల్లోని ఉయ్యాలవాడ, జూపాడుబంగ్లా,నంద్యాల మండలంలోని పాంపల్లె, గోవిందపల్లి,జంబులదిన్నె, పారుమంచాల, జూపాడుబంగ్లా,లింగందిన్నె, భీమావరం మరియు బిల్లలాపురం గ్రామపంచాయతీలు సందర్శించి వివిధ కేంద్ర పథకాల కింద అమలవుతున్న పనులను పరిశీలించడం జరిగిందని చెప్పారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయితీల్లో ఆయా పథకాల ద్వారా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పనులను పరిశీలించి వాటిలో గుర్తించిన విధానపరమైన అంశాలను కలెక్టర్ సమక్షంలో హాజరైన సంబంధిత శాఖల అధికారులతో బృందం సభ్యులు కూలంకషంగా చర్చించారు.పలు అంశాలలో తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులపై పలు సలహాలు,సూచనలు జారీ చేశారు.జాతీయస్థాయి పర్యవేక్షణ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి, సూచించిన మేరకు పథకాలను అమలు పరచడంలో ఎలాంటి విధానపరమైన లోపాలు లేకుండా సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు నియమ నిబంధనలకు అనుగుణంగా పథకాలను లబ్ధిదారులకు చేర్చేందుకు పారదర్శకంగా విధానాలను అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎన్ఎల్ఎం లీడర్ సంతోష్ ఫరీదా,సభ్యులు సూర్య ప్రదాన్ డ్వామా పిడి సూర్యనారాయణ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

