స్వచ్ఛతకే తొలి ప్రాధాన్యత
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
ఇంటింటి చెత్త సేకరణకు 20 వాహనాల ప్రారంభం
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం స్వచ్ఛతకే తొలి ప్రాధాన్యత ఇస్తూ నగరంలో 100 శాతం ఇంటింటి చెత్త సేకరణను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం ఎన్ఆర్ పేటలోని నగరపాలక కార్యాలయం వద్ద స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మంజూరు చేసిన చెత్త సేకరణ వాహనాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో చెత్త సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మొత్తం 91 ఆటోలు మంజూరు చేయబడినట్లు తెలిపారు. అందులో భాగంగా తొలి విడతలో 20 వాహనాలను వినియోగంలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.నగర ప్రజలు స్వచ్ఛతకు సహకరించాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి శానిటేషన్ మైక్రో పాకెట్ పరిధిలో సిబ్బంది వివరాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గార్బేజ్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. రహదారులు, డ్రైనేజీ కాలువల్లో చెత్త వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, డిఈఈ పవన్ తదితరులు పాల్గొన్నారు.

