రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ.. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
1 min read

పెదపాడులో మీ మీ భూమి-మీ హక్కు కార్యక్రమం
పెదపాడు తహసిల్దార్ కృష్ణ జ్యోతి,ఎంపీడీవో సిబ్బంది పాల్గొన్నారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఎటువంటి తప్పుఒప్పులకు ఆస్కారం లేకుండా పట్టాదార్ పాస్ పుస్తకాలను రాజముద్రతో రైతులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పెదపాడు మండలం వసంతవాడ గ్రామ సచివాలయం కార్యాలయంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో ఈ కెవైసి. పట్టాదార్ పాస్ పుస్తకాలలో మార్పులు, పొరపాటుగా ముద్రించిన వాటిని సరిచేసి రెవిన్యూ సిబ్బంది అందిస్తున్నారా? లేదా ? అని రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో రైతులను రెవిన్యూ సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అనే విషయాన్నీ కూడా కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మీ భూమి.. మీ హక్కు కార్యక్రమం కింద పట్టాదార్ పాస్ పుస్తకంలో పొరపాట్లను సరిచేసి రాజముద్రతో రైతులకు అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. రైతులు తమ వివరాలను ఈ కెవైసి చేసుకుని, వారి పట్టాదార్ పాస్ పుస్తకాలలో ఏమైనా పొరపాటు ముద్రణ ఉంటే వాటి వివరాలతో దరఖాస్తు చేస్తే వెంటనే వాటిని సరిచేసి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించడం జరుగుతుందని, రైతులందరూ ఈ ఆవాసకాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పెదపాడు తహసిల్దార్ కృష్ణ జ్యోతి ఎంపీడీవో అమీలుజమ, రెవిన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

