అమ్మవారి సంబరాలకు సర్వం సిద్ధం
1 min read

దసరా ఉత్సవాలకు కనీసం 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
ఆ స్థాయిలోనే అన్నింటా పకడ్బందీ ఏర్పాట్లు
35 సెక్టార్లలో మూడు షిఫ్ట్ల్లో ప్రత్యేక బృందాలు
24X7 సేవలందించే కమాండ్ కంట్రోల్ కేంద్రం
సాధారణ భక్తుల సౌకర్యార్థం రూ. 500 దర్శనాలు రద్దు
ఏఐ టెక్నాలజీతో క్యూ లైన్లలో భక్తుల రద్దీపై నిరంతర పర్యవేక్షణ
స్వీయ నియంత్రణతో సమష్టిగా ఉత్సవాలను విజయవంతం చేద్దాం
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భద్రతా ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు
విజయవాడ , న్యూస్ నేడు :శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దసరా మహోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని.. కనీసం 20 లక్షల మంది భక్తులు ఈసారి ఉత్సవాలకు వచ్చే అవకాశముందని.. ఆస్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు తెలిపారు. దసరా మహోత్సవాలు-2025పై శనివారం కనకదుర్గమ్మ ఆలయం మహామండపం ఆరో అంతస్తులో కలెక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఈవో వీకే శీనానాయక్.. ఆలయ పండితులు, అధికారులతో కలిసి మీడియా సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎంతమంచి భక్తులు వచ్చినా ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఈసారి ఏర్పాట్లు చేశామని.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వినూత్న విధానాలతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి దర్శనం మధురానుభూతిని కలిగించేలా ఏర్పాట్లు చేశామన్నారు.వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం.. చాలా ముఖ్యమైన పారిశుద్ధ్యం, మినరల్ వాటర్ పంపిణీ, మరుగుదొడ్లు వంటి వాటికి సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. 40 పాయింట్లలో 25 లక్షల వాటర్ బాటిళ్లను సిద్దంగా ఉంచనున్నట్లు తెలిపారు. మూడు షిఫ్టుల్లో 1,600 మంది సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారని తెలిపారు. 405 మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేసినట్లు ధ్యానచంద్ర వెల్లడించారు.ఆలయ ఈవో వీకే శీనా నాయక్.. లడ్డూ ప్రసాదాల తయారీ, విక్రయ కేంద్రాలు, అన్న ప్రసాదం అందించేందుకు చేసిన ఏర్పాట్లు తదితరాలను వివరించారు. క్యూలైన్లలో భక్తులకు తాగునీటితో పాటు పాలు, మజ్జిగ, బిస్కట్ ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు.

