ఎల్ఆర్ఎస్ మేళాకు విశేష స్పందన
1 min read
దరఖాస్తుదారులకు వెంటనే ప్రొసీడింగ్స్ అందజేత
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం ఏళ్ల తరబడి చట్టబద్ధత పొందని లేఅవుట్లకు విముక్తి కల్పించే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకొని వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఎల్ఆర్యస్ మేళాకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ప్రక్రియ పూర్తి చేసి ప్రొసీడింగ్స్ అందజేసేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం ప్రారంభించిన ఎల్ఆర్ఎస్ మేళాకు దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రక్రియ పూర్తి చేస్తున్న వారికి కమిషనర్ చల్లా ఓబులేసు ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేస్తున్నారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు గడువు ముగిసిన నేపథ్యంలో, ప్రక్రియ పూర్తికి అవసరమైన షార్ట్ ఫాల్ పత్రాలు సమర్పించి, ఫీజులు చెల్లించిన వారికి ధృవీకరణ పత్రాలు, ప్రొసీడింగ్స్ అందజేస్తున్నారు. ఈ ప్రక్రియను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్వయంగా పర్యవేక్షిస్తూ, అర్హులైన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ అందజేస్తున్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసిన వారు అవసరమైన పత్రాలు, ఫీజులు త్వరితగతిన పూర్తి చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా దరఖాస్తుదారులు మిగిలి ఉంటే శుక్రవారం మేళాను వినియోగించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఇన్చార్జి సిటీ ప్లానర్ వై. వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ప్లానింగ్ కార్యదర్శులు, ఎల్టీపీలు తదితరులు పాల్గొన్నారు.

