ఎస్సార్ క్యాపిటల్, సదరన్ రూట్స్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి టీజీ భరత్ భేటీ
1 min read
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చ
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ న్యూయార్క్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వారికి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం అందిస్తామని ఆయన పెట్టుబడిదారులతో చెప్పారు. న్యూయార్క్లో ఎస్సార్ క్యాపిటల్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ మధు వప్పులూరితో మంత్రి టీజీ భరత్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆయనతో పంచుకున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో ఏపీకి 25 శాతం పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ఆయనతో మంత్రి చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే టాప్లో ఉండేలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అందించాలని ఆయన్ను కోరినట్లు చెప్పారు. అనంతరం సదరన్ రూట్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. సదరన్ రూట్స్ సంస్థ త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఒక అత్యాధునిక పెకాన్ గింజల పొట్టు తీసే మరియు ఆహార శుద్ధి యూనిట్ను ఏర్పాటు చేయనుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.


