ప్రభుత్వ సేవల ద్వారా ప్రజా అభిప్రాయం మెరుగుపడాలి
1 min read
చిత్తశుద్ధితో పనిచేసి జిల్లాను మెరుగైన స్థానంలో నిలపాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవల ద్వారా ప్రజా అభిప్రాయం (పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్) మెరుగుపడేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ రజియా సుల్తానా, జిల్లా సరఫరాల అధికారి రవిబాబు, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డీఎల్డీఓ శివారెడ్డి, జిల్లాలోని 13 మండలాల సబ్ రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల వారి సంతృప్తి స్థాయిని తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్ర స్థాయిలో రిజిస్ట్రేషన్ శాఖ చివరి స్థానంలో ఉండటం అత్యంత బాధాకరమని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలు కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లాగిన్ ను స్వయంగా ఓపెన్ చేసి, వివిధ శాఖలకు సంబంధించిన ప్రజల అభిప్రాయం కోసం అడిగే ప్రశ్నలను చదివి వినిపిస్తూ, వాటి ఆధారంగా ప్రజా సంతృప్తి పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

