ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
1 min read

నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
యస్ఏపి క్యాంపు బైపాస్పై వాహనాల ప్రయాణం
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం నగర పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు తెలిపారు. బుధవారం ఆయన యస్ఏపి క్యాంపులో బైపాస్ రహదారి నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో అధికంగా ట్రాఫిక్ ఉండే బళ్ళారి చౌరస్తాలో వాహనాల రద్దీని నియంత్రించాలనే రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు, యస్ఏపి క్యాంపులో బైపాస్ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 130 మీటర్ల బైపాస్ రహదారి నిర్మాణం నిర్మించి, యస్ఏపి క్యాంపు అంతర్గత రహదారికి అనుసంధానం చేసి, హైదరాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలను ఇంటర్ నేషనల్ ఫంక్షన్ సమీపంలో నుండి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోకి చేరుకునేలా చర్యలు చేపట్టామన్నారు. తద్వారా బళ్ళారి చౌరస్తాలో ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. రూ.85 లక్షలతో పనులను చేపట్టామని, ఇప్పటికే డబ్లూబియం రహదారి పూర్తి అయిందని, మధ్యనున్న గేటును సైతం తొలగించడం జరిగిందన్నారు. బుధవారం నుండి వాహనాల ప్రయాణం మొదలైందని, త్వరలో బైపాస్ రహదారి పనులు పూర్తి చేస్తామన్నారు.అంతకుముందు బుధవారపేట, సి.క్యాంపు రైతుబాజార్, అశోక్ నగర్, తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. 15వ వార్డు బుధవారపేట మైదానంలో రూ.40 లక్షలతో చేపట్టిన సుందరీకరణ పనులను పరిశీలించారు. మొక్కలు, నడకబాట, వ్యాయమ పరికరాల పనులు పూర్తి అయ్యాయని కమిషనర్ తెలిపారు. అలాగే మారెమ్మ గుడి దగ్గర ప్రధాన మురుగు కాలువ వద్ద ప్రజలు వ్యర్ధాలు వేయకుండా రక్షణ వలయం ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. రైతు బజార్ నందు ర్యాంపు, రేకు షెడ్డు పనులను చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఆనంద్ థియేటర్ హంద్రీ నదిలో వ్యర్ధాలు తొలగించాలని, ఒడ్డున పచ్చదనం పెంపొందించాలని కమిషనర్ ఆదేశించారు.కార్యక్రమంలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఇంచార్జ్ ఎస్ఈ శేషసాయి, డిఈఈలు మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హార్టికల్చర్ ఏడి విజయలక్ష్మి, బిల్డింగ్ ఇంస్పెక్టర్ అంజాద్ బాష, పారిశుద్ధ్య తనిఖీదారులు అనిల్, రమేష్, టిఏఈలు మహేష్, రాంమోహన్, తదితరులు పాల్గొన్నారు.

