పంట బీమా నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చెయ్యాలి
1 min read
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా:మనజీర్ జీలానీ సమూన్
కొప్పాక గ్రామాన్ని సందర్శన ఎరువుల పంపిణీ
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండలం, కొప్పాక గ్రామంలోని వరి పొలాలు మరియు PACSను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ గౌరవ డైరెక్టర్ డా. మనజీర్ జీలానీ సమూన్, IAS గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో పాటు RSK అసిస్టెంట్తో కూడా పంటల ప్రస్తుత పరిస్థితి, సాగు విస్తీర్ణం, పంట ఎదుగుదల దశ, ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలు, APAIMS యాప్ ద్వారా ఎరువుల పంపిణీ, అలాగే PMFBY పంట బీమా నమోదు పురోగతి మరియు రైతుల స్పందనపై సమగ్రంగా ఆరా తీశారు.డైరెక్టర్ గారు PMFBY పంట బీమా పథకంలో అర్హులైన ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకొని గడువులోపు ప్రీమియం చెల్లించి తమ పంటలను ప్రకృతి వైపరీత్యాలు మరియు వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల నుండి రక్షించుకోవాలని సూచించారు. పంట బీమా నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసి ప్రతి అర్హ రైతుకు చేరేలా వ్యవసాయ శాఖ అధికారులు, RSK సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే రైతులు APCNF (సహజ వ్యవసాయం) పద్ధతులను విస్తృతంగా అవలంబించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నేల సారాన్ని పెంపొందించి, వాతావరణ మార్పులను తట్టుకునే స్థిరమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఎల్ నినో పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు.రైతులు APAIMS యాప్ ద్వారా ఎరువుల పంపిణీ పారదర్శకంగా, సులభంగా జరుగుతోందని తెలియజేస్తూ ప్రభుత్వ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, ఏలూరు ఏడీఏ ఈ. అనిల కుమారి, డీపీఎం (APCNF), ఏలూరు బి. వెంకటేష్ , డీఎం (మార్క్ఫెడ్) చి.ఎల్.డి.వి. ప్రసాద్ గుప్తా, PACS చైర్పర్సన్ కొసరాజు వీరవెంకట వరప్రసాద్ (బుజ్జి) PACS సెక్రటరీ రమేష్ , వీరగంటి రాంబాబు , వేగొంట శ్రీనివాసరావు ఆర్ ఎస్ కె సిబ్బంది, APCNF సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.


