రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి
1 min read

డాక్టర్:దేవరకొండ వెంకటేశ్వర్లు
బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత రాజ్యాంగ నిర్మాణంలో తన శ్రమని ప్రస్తావిస్తూ బాబాసాహెబ్ డాక్టర్: బి.ఆర్.అంబేద్కర్ అన్న మాటలు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డా:దేవరకొండ వేంకటే శ్వర్లు పేర్కొన్నారు. నా సర్వస్వం రాజ్యాంగ నిర్మాణం కోసం ధార పోశాను. నేను భౌతికంగా మీకు దూరమైనా సరే రాజ్యాంగం రూపంలో ఎప్పుడు మీతోనే ఉంటానని’ డాక్టర్:బాబాసాహెబ్ చెప్పిన మాటలు ఆయన జన్మది నోత్సవ వేడుకలు సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా సమ సమాజ స్థాపనకి, సామాజిక న్యాయానికి పునాదులు వేశారన్నారు. ఆధిపత్య భావజాల పరులకు, అణచి వేసే ధోరణి కలిగిన వారికి నేటి భారత రాజ్యాంగం అడ్డుగోడగా ఉందని. దానితో పాటు బాబాసాహెబ్ సిద్ధాంత భావజాలాలు కూడా కంటగింపుగా ఉన్నాయని చెప్ప డానికి విచారిస్తున్నానని వివరించారు. ఈ దేశంలో డాక్టర్: అంబేద్కర్ భావజాలం ఉన్నంతవరకు ఆధిపత్య భావజాలం కలిగిన వారి ఆటలు సాగవని గ్రహించి, దేశ ప్రజలపురోగతి కోసం, చైతన్యం కోసం ఏ మాటలైతే అంబేద్కర్ చెప్పారో ఆ మాటలనే ఆధిపత్యం చెలాయించేవారు ఆయుధంగా మార్చుకొని ఈ దేశం నుంచి అంబేద్కర్ని దూరం చేయాలంటే ముందుగా రాజ్యాంగాన్ని మట్టు పెట్టాలని కంకణం కట్టుకున్నారని వారి వ్యవహార శైలిని బట్టే అర్థం అవుతుందన్నారు. ఈ పరిస్థితి వల్ల నిజమైన దేశ భక్తులు అణగారిన, అణగదొక్కబడిన వర్గాలను చైతన్యం చేయాలని, అధిపత్య వర్గాలకు రాజ్యాంగంపై ఉన్న పట్టు రాజ్యాంగపరమైన హక్కులను వినియోగించుకుని ఎదిగిన వారిలో కనీసం ఒక్క శాతం మందికి కూడా లేకపోవడం కడు శోచనీయమని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గతం గతః ఇప్పటికీ మించిపోయింది లేదు. మనం కదలాలన్నా, కదిలించాలన్నా మనకి బలం, దైర్యం ముఖ్య మని, అది రాజ్యాంగంపై మనకున్న పట్టు ద్వారా మాత్రమే వస్తుంది. కనుక మనం చదువుదాం, కొంతమందికైనా రాజ్యాంగాన్ని బహుమతిగా ఇచ్చి చదివిద్దాం. తద్వారా మనం అంబేడ్కర్ ఆశయ మార్గంలో ఉండడానికి అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

