యోగ ద్వారా శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది
1 min read
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: యోగ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక వట్లూరులోని టిటిడిసి లో బుధవారం ఉదయం యోగా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పొందవచ్చునని, ప్రతీ ఒక్కరూ యోగా ను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. ఈనెల 21 వతేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయం పరిధిలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 200 మందికి పైగా మాస్టర్ ట్రైనీలతో ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ప్రతి గ్రామ/వార్డు సచివాలయం పరిధిలోనూ యోగా ట్రైనర్ల ద్వారా స్థానిక ప్రజలకు యోగా పై శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో పలు ప్రముఖ ఆధ్యాత్మిక,పర్యాటక ప్రాంతాలలో యోగా కార్యక్రమాలు నిర్వస్థామని, ఈనెల 11 వ తేదీన ద్వారకాతిరుమల లోను,ఈనెల 19వ తేదీన పోలవరం మండలం పట్టిసీమలో పెద్దఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 21వ తేదీ ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ఏలూరు నగరంలో వెయ్యి మందికి పైగా ప్రజలకు యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలియజేసారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన యోగా ప్రక్రియను ప్రతీ ఒక్కరూ పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ,జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ,డిపిఓ మల్లికార్జునరావు,డిఆర్ డిఏ పీడీ విజయలక్ష్మి , ప్రభృతులు పాల్గొన్నారు.


