ఆర్యవైశ్యుల్లో 95 శాతం కూటమికి ఓటు వేశారు.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
1 min read
తాడిపత్రిలో ఆర్యవైశ్యుల సమావేశంలో పాల్గొన్న మంత్రి టీజీ, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
కర్నూలు, న్యూస్ నేడు: గడిచిన ఎన్నికల్లో 95 శాతం మంది ఆర్యవైశ్యులు కూటమికి ఓటు వేశారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి, అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి టీజీ భరత్ అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ మండపం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే జె.సి అస్మిత్ రెడ్డితో కలిసి ఆయన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ మండపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే.సి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కూటమికి అండగా నిలిచారన్నారు. అందుకు తగ్గట్టుగానే సీఎం నారా చంద్రబాబు నాయుడు వైశ్యులకు ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో వైశ్యులకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. అంతేకాకుండా పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్పుచేశారన్నారు. ఇక అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం అమరావతిలో ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం 6 ఎకరాల స్థలం కేటాయించిందని, అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహం పెడుతున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 9 నెలల్లో దేశంలోవచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయని ఇటీవల ఓ నివేదిక వెల్లడించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక స్థానికంగా జే.సి కుటుంబం వైశ్యులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వారి సహకారం వల్లే ఇలాంటి గొప్ప కార్యక్రమం జరుపుకుంటున్నామన్నారు. మంచిచేసే నాయకులకు ఎప్పటికీ అండగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ భూమా నాగ రాగిణి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, వాసవి సత్ర సమూదాయాల ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య, ఏపీఐఐసీ డైరెక్టర్ డి.వి.ఆర్ జగదీష్ గుప్త, ఆర్యవైశ్య సంఘం తాడిప్రతి ఛైర్మన్ సురేంద్రనాథ్, కాశీ అన్నపూర్ణ సత్రాల ప్రెసిడెంట్ భవనాశి వాసు, పొలిటికల్ ఛైర్మన్ సత్యనారాయణ, ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శబరి వరప్రసాద్, అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిరిగుప్ప వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


