పచ్చదనం పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
1 min read

చెన్నూరు ,న్యూస్ నేడు: పచ్చని చెట్లు, పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రతతోనే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు తెలిపారు. శనివారం ఆయన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ,విద్యార్థులతో కలిసి పచ్చదనం పరిశుభ్రతపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి వ్యక్తి తమ వంతు బాధ్యతాయుతంగా తమ ఇంటి పరిసరాలలో మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా వారు చేపట్టాలని తెలిపారు. అంతేకాకుండా గ్రామాల పరిశుభ్రతకు తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఇలా తమ వంతు బాధ్యతాయుతంగా చేసినట్లయితే ఆరోగ్య గ్రామపంచాయతీగా తీర్చిదిద్దవచ్చని ఆయన అన్నారు. దీనిని ఒక ఉద్యమం లాగా ప్రతి ఒక్కరూ తీసుకొని చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని మహిళ సంఘాల ఆధ్వర్యంలో, ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజల చేత మొక్కలు నాటించాలని ఆయన తెలిపారు. ఇలా చేసినట్లయితే గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ గా మారడం ఖాయమని ఆయన అన్నారు అనంతరం ఆయన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు విద్యార్థులతో పచ్చదనం పరిశుభ్రత ఆరోగ్యంపై ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా బయనపల్లె గ్రామపంచాయతీలో సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో, రామనపల్లె గ్రామపంచాయతీలో సర్పంచ్, కార్యదర్శి గురువేశ్వరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సురేష్ బాబు, సర్పంచ్, సిద్ది గారి వెంకటసుబ్బయ్య, టిడిపి మండల కన్వీనర్ కల్లూరు విజయ భాస్కర రెడ్డి , ఏపీవో శైలజ, ఏపిఎం వెంకటేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, హరిత రాయబారులు, విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


