జనవరి 4న విశాఖపట్నంలో జరిగే సిఐటియు బహిరంగ సభను జయప్రదం చేయండి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కార్మిక వర్గం ఎన్నడూ లేనంతగా నేడు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నదని కావున కార్మికులు,ప్రజలు జనవరి 4న చలో విశాఖ తరలి వచ్చి సిఐటియు అఖిల భారత మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి.మాణిక్యం శెట్టి,టి.శివరాం పిలుపునిచ్చారు.ముందుగా నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ఉదయం స్థానిక కొండపేటలోని సిఐటియు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ప్రముఖ న్యాయవాది నాగభూషణం రెడ్డి ని, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.కమిషనర్ తో కార్మిక సమస్యలపై చర్చించారు.సాయంత్రం పాత బస్టాండ్ ప్రాంతంలో మహాసభల కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.సీనియర్ నాయకులు జి.కొండయ్య, మండల కన్వీనర్ ఏవి. భాస్కర్ రెడ్డి,కో కన్వీనర్ బి.నాగమద్దయ్య,పట్టణ కోశాధికారి యు.శ్రీనివాసులు, రామచంద్రుడు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరి కార్మికులకు జీతాలు పెంచం… జీవితాంతం పనిచేసినా పర్మినెంట్ చేయం… విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తాం… లేదా మూసేస్తాం… పెన్షన్ నామమాత్రం చేస్తాం… కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను లేబర్ కోడ్స్ పేరుతో నిర్వీర్యం చేస్తాం… సంఘాలు పెట్టనివ్వం… సమ్మెలు చేయనివ్వం… అన్నట్లుగా ఉన్నదని గ్రామీణ వ్యవసాయ కార్మికులకు తిండి పెట్టే ఉపాధి హామీ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసి ఉపాధి కూలీల పొట్ట కొడుతున్నదని కార్మిక కర్షక ఐక్యత తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను త్రిప్పి కొట్టడమే అఖిల భారత మహాసభల ప్రధాన లక్ష్యం అని అందుకే పెద్ద ఎత్తున తరలివచ్చి జనవరి 4న జరిగే కార్మిక మహా ప్రదర్శన-బహిరంగ సభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

