జి. రామకృష్ణ అకాల మరణం యూనివర్సిటీకి తీరనిలోటు: వీసీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీ మేనేజిమెంట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి. రామకృష్ణ అకాల మరణం యూనివర్సిటీకి తీరనిలోటని వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు నివాళులర్పించారు. వర్సిటీ సెనేట్ హాలులో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో ఆచార్య బసవరావు మాట్లాడుతూ ఈ నెల 15వతేదీన డాక్టర్ రామకృష్ణ మరణించడం బాధాకరమన్నారు. మేనేజిమెంట్ విభాగంలో బోధనా విధులతోపాటు వర్సిటీ ప్లేస్మెంట్ అధికారిగా అంకితభావంతో ఆయన బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. స్వల్పవ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన వారి పిల్లలకు వర్సిటీ బాసటగా నిలుస్తుందన్నారు. ఆ కుటుంబానికి వర్సిటీ తరపున అందవలసిన ప్రయోజనాలను త్వరగా చెల్లించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏదేమైనప్పటికీ సమస్యలను ఎదుర్కొనే మనోధైర్యాన్ని పెంపొందించుకోవలసినదిగా ఆయన వర్సిటీ వర్గాలకు హితవు పలికారు. కార్యక్రమంలో ప్రసంగించిన వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ రాయలసీమ యూనివర్సిటీ ప్రారంభమైన తొలినాళ్లనుండి నేటివరకు డాక్టర్ రామకృష్ణ అందించిన సేవలను స్మరించుకున్నారు. తనదైన వ్యక్తిత్వంతో అందరి అభిమానాన్ని సంపాదించుకున్న డాక్టర్ రామకృష్ణ సేవలు చిరస్మరణీయమని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు నివాళులర్పించారు. డాక్టర్ రామకృష్ణ మృతితో ఎంబీఏ విద్యార్థులు ఒక గొప్ప అధ్యాపకుడిని కోల్పాయారని వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య పి.వి. సుందరానంద్, సిడిసి డీన్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి, ఎగ్జామినేషన్స్ డీన్ ఆచార్య ఎన్. నరసింహులు, IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ శ్యామలా సరోజిని, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లుతో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు డాక్టర్ రామకృష్ణకు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని మౌనం పాటించారు.

