వంగాయగూడెంకి అనుసంధానంగా కృష్ణకాలువపై శరవేగంగా బ్రిడ్జి నిర్మాణ పనులు
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వివిధ శాఖల అధికారులతో స్వయంగా పనులు పరిశీలన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరంలో మౌళిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దానిలో భాగంగానే రహదారులు, అనుసంధాన వంతెనల నిర్మాణానికి, అభివృద్ధికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని, దాంతోపాటుగా వివిధ శాఖల అధికారులను సమన్వయపరుస్తూ, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు రామకృష్ణాపురం మినీబైపాస్ రోడ్డు నుండి వంగాయగూడెం రోడ్డుకు అనుసంధానంగా కృష్ణకాలువపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పరిశీలించారు. మరోపక్క వంతెన ఎత్తుకు అనుగుణంగా విద్యుత్ స్తంభాలను ఎత్తుకు పెంచాల్సిన అవసరం ఉందని ఆ సమస్యను పరిష్కరించాలంటూ ట్రాన్స్కో ఈఈ కెఎం అంబేద్కర్ను ఆదేశించారు. ఇదేక్రమంలో శ్లాబ్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు జ్యూట్మిల్ వద్ద కాలుపై పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో దానిపక్కనే నూతన బ్రిడ్జి నిర్మాణానికి సత్వర చర్యలు చేపట్టామన్నారు. మార్చి నెలాఖరు నాటికి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అందుకు ఎక్కడా ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఆలోచనతోనే వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం కల్పిస్తూ, బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏపి మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటి మేయర్ కర్రి శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్ పెదబాబు, పాము శామ్యూల్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు,కప్ప ఉమామహేశ్వరరావు, వీరంకి త్రినాథ్ , బెల్లపుకొండ కిషోర్, ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.ఎం. అంబేద్కర్ మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

