‘ వికసిత్ భారత్ ’ పనుల పరిశీలన
1 min read

జిల్లాలోని ఐదు మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందం
- ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడి
- కేంద్ర బృందాన్ని కలిసిన పిడి డ్వామా మాధవీ లత
కర్నూలు, న్యూస్ నేడు :వికసిత్ భారత్ రోజ్ గార్ అజివికా హామీ మిషన్ ( విబిజి రామ్జి) పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో చేసిన పనులను ఐదు రోజులుగా కేంద్ర బృందం పరిశీలించింది. ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు జరిగిన కేంద్ర బృందం పర్యటనలో భాగంగా వెల్దుర్తి, దేవనకొండ, తుగ్గలి, మద్దికెర మరియు కర్నూలు మండలాల్లో జరిగిన ఉపాధి హామీ పనులను పరిశీలించింది. చెక్ డ్యాంల పూడిక తీత, పండ్ల తోటల పెంపకం, నీటి కుంటల పనులను కూడా బృందం పరిశీలించింది. ముఖ్యంగా కూలీల హాజరు విధానం, అమలు తీరు తదితర అంశాలను కూడా బృందం కూలీలను అడిగి తెలుసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు కేంద్ర బృందం సభ్యులు తెలిపారు.
కేంద్ర బృందాన్ని కలిసిన డ్వామా పిడి
జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందాన్ని కర్నూలు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ మాధవీలత మర్యాద పూర్వకంగా కలిశారు. బృందంలోని నలుగురు సభ్యులకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం కర్నూలు జిల్లాలో జరిగిన వికసిత్ భారత్ రోజ్గారి అజివికా హామీ మిషన్ కింద చేసిన పనుల తీరు… పనుల వద్ద కూలీలకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, జాబ్ కార్డులు, కూలీల సంఖ్య తదితర అంశాలను కేంద్ర బృందానికి క్షుణ్ణంగా వివరించినట్లు డ్వామా పిడి మాధవీలత తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుండి సీనియర్ కన్సల్టెంట్ మామ్ చంద్, సీనియర్ ఆడిట్ అధికారి అనితా చౌదరి, కిరణ్ మాలి, నీరజ్ యాదవ్ పాల్గొన్నారు.

