సేంద్రియ ఆహార ఉత్పత్తులు ఈ నెల 18,19 తేదీలు మెగా మేళా విజయవంతం చెయ్యాలి
1 min read

సేంద్రియ ఆహార ఉత్పత్తులు అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ,పకృతి వ్యవసాయ రైతులకు బాసటగా నిలవాలి
జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె.హబీబ్ భాషా
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం జాయింటు డైరెక్టరు ఛాంబర్లో గురువారం ఏలూరు రైతు సంపద సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తులు మెగా మేళా ఈ నెల 18,19 తేదీలు జరగనున్న దృష్టా, పట్టణ ప్రజలు పాల్గొనాలని, కార్యక్రమం విజయవంతంపై పాత్రికేయులు సమావేశాన్ని జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్. కె.హబీబ్ భాషా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె.హబీబ్ భాషా మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో వరితో సమానంగా ఉద్యానవన పంటలు మరియు పకృతి, సహజ, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు కూడా రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తులు జిల్లాలో 50 వేలు మంది రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకృతి వ్యవసాయం మరింత పెంచాలని ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. జిల్లాలో పకృతి సహజ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు మరింత పెంచుటకు, పండించిన పంటలు వినియోగదారులకు అందించేలా, ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం ఉండేలా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ప్రత్యేక దృష్టిపెట్టి ఏలూరు రైతు సంపద ఒక పోర్టల్ ఏర్పాటు చేశారని అన్నారు. ఈ పోర్టల్ నందు సుమారు 200 మంది సేంద్రియ వ్యవసాయ రైతులు, 213 ఉత్పత్తులు, 80 మంది ఫుడ్ ఎంటర్ ప్రైజెస్ వారు ఉన్నారని అన్నారు. తమ ఉత్పత్తులను, వినియోగదారులకు నేరుగా అందిస్తున్నారని, మధ్యవర్తులు లేకుండా వినియోగదారులు ఉత్పత్తిదారులు రేటు నిర్ణయించుకుని అమ్మకాలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఏలూరు రైతు సంపదను మరింత వినియోగంలోకి తెచ్చేలా, అందరికీ తెలిసేలా ఈ నెల 18,19 తేదీలు మెగా మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.స్థానిక డిసియంఎస్ ఫంక్షన్ హాలులో ఉదయం 9:00 గంటలు నుండి రాత్రి 9:00 గంటలు వరకు మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 50 స్టాల్స్ , 80 రైతులు, 150 వివిధ రకాలు ఉత్పత్తులు సిద్ధం అయ్యాయని, ఆసక్తి కలవారు ముందుకు రావాలని కోరారు.మేళా యొక్క ప్రధాన ఉద్దేశ్యం సేంద్రియ మరియు సహజ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, రైతులకు నేరుగా వినియోగదారులతో సంబంధం కల్పించడం మరియు ప్రజలకు ఆరోగ్య కరమైన ఆహారంపై అవగాహన కల్పించడం అన్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, రైతులు ఉత్పత్తులను నేరుగా వినియోగ దారులకు విక్రయించే వేదిక అన్నారు. రైతులకు మార్కెటింగు అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ఆహార మేళా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం మని, రైతులు ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. మేళాలో ప్రత్యేక ఆకర్షణలు నూజివీడు మామిడి పండ్లు, సేంద్రియ పండ్లు, కూరగాయలు,సహజ ఆహార పదార్థాలు, మిల్లెట్లు, సేంద్రియ బెల్లం, అపరాలు, నూనెలు, దేశ రకాలు బియ్యం, తదితర వాటిని వినియోగదారులకి పరిచయం చేస్తున్నామని అన్నారు. చాక్లెట్లు, పచ్చళ్ళు మరియు వివిధ రకాలు తిను బండారాలు మొదలగునవి ఉంటాయని తెలిపారు. ఏలూరు పట్టణ ప్రజలు అందరూ ఆహ్వానితులేనని అన్నారు. వివిధ శాఖలు అధికారులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను ఈ మేళాకు తీసుకురావాలని విరివిగా కొనుగోలు చేసి విజయవంతం చేసే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. స్వయం సహాయ ఉత్పత్తులు -డ్వాక్రా ఉత్పత్తులు అమ్మకాలు కోసం స్వయం ఏలూరు పోర్టల్ కూడా అందుబాటులో ఉందని అన్నారు. మేళాలో డ్వాక్రా మహిళలు తయారుచేసిన 200 ఉత్పత్తులను కూడా మేళాలో ప్రదర్శించి, అమ్మకాలకు చర్యలు తీసుకుంటున్నామని, వాటిని కూడా ఆదరించి, కొనుగోలు చేసి వారిని ఆశీర్వదించాలని అన్నారు. పాత్రికేయులు సమావేశంలో ఏపి యంఐపి పిడి డా.యస్. రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజా నాయక్, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మీ, పకృతి వ్యవసాయ జిల్లా మేనేజరు బి.వెంకటేష్, వ్యవసాయ,ఉద్యానవన శాఖ ఉద్యోగులు,తదితరులు పాల్గొన్నారు.

