రైతులు నష్టపరిహారం అడిగితే అరెస్టులా
1 min read

రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్..
ఓర్వకల్లు న్యూస్ నేడు: నష్ట పరిహారం చెల్లించాలని రైతులు అడిగితే రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ అన్నారు.తిప్పాయిపల్లె వద్ద జరుగుతున్న కరెంట్ పనుల వద్ద నష్టపరిహారం కోసం పనులను అడ్డగించిన రైతులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం ఏంటని ప్రశ్నించారు.రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ,వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న,రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మధుసూదన్,చంద్రబాబు నాయుడు సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు షాజహాన్ శ్రీధర్ రైతులతో కలిసి అరెస్టు చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై గురువారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వారి ఆమోదం లేకుండా హైపవర్ తీగలను మెగా కంపెనీ వారు పట్టా భూముల్లో అక్రమంగా ఏవిధంగా వేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి పరిహారం కోసం రైతులు పోరాడుతుంటే పోలీసులు అక్రమంగా రైతులను అరెస్ట్ చేసి నిర్బంధించడం సరైనది కాదన్నారు.తక్షణమే రైతులతో ఉన్నతాధికారులు చర్చించి న్యాయమైన నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.అనంతరం పోలీసులు రైతులను వదలి పెట్టడం జరిగిందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు బుగ్గ రాముడు, సూర్యనారాయణ,మల్లి మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

