రాయలసీమ నీటి హక్కుల కోసం ఘోషించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
1 min read

కర్నూలులో జరిగిన రాయలసీమ నీటి ప్రాజెక్టుల సమాలోచన సమావేశంలో వేదవతి, గుండ్రేవుల పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్
ఆలూరు న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని బిర్లా గేటు సమీపంలో ఉన్న శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్లో “రాయలసీమ నీటి ప్రాజెక్టులు – సమాలోచన సమావేశం” ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ముఖ్య ప్రసంగం చేస్తూ రాయలసీమకు నీటి పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతానికి సరైన నీటి పంపిణీ చేయకుండా ఈ ప్రాంతానికి ద్రోహం జరుగుతోందని ఆయన ఆరోపించారు.రాయలసీమ ఎప్పటికీ కరువు బారిన పడే ప్రాంతమని, ఇక్కడి రైతుల భవిష్యత్తు నీటి ప్రాజెక్టులపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కరువు సీమకు వరం అని అభివర్ణిస్తూ, గుండ్రేవుల రిజర్వాయర్ పనులను తక్షణమే ప్రారంభించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలాగే రాయలసీమలో నీటి కొరత కారణంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయం సంక్షోభంలో ఉందని తెలిపారు. ఆలూరు నియోజకవర్గానికి ఎంతో కీలకమైన వేదవతి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.ఈ సమావేశంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామి రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, గంగుల ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా మరియు మండల కమిటీ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

