చెత్తా శుద్దీకరణ త్వరితగతిన పూర్తి చేయాలి
1 min read

జిల్లా కలెక్టర్, నగరపాలక ప్రత్యేక అధికారి డా. ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం నగరంలోని ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణలో భాగంగా గార్గేయపురం డంప్యార్డులో నిల్వ ఉన్న లెగసీ వ్యర్థాలను బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా త్వరితగతిన శుద్ధి చేసి, భూభాగాన్ని పునర్వినియోగానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి దేవనగర్లోని మురుగు శుద్ధి కేంద్రం (ఎస్టీపీ), గార్గేయపురం డంప్యార్డును పరిశీలించారు.గార్గేయపురం డంప్యార్డులో సుమారు 15 ఎకరాల్లో పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలపై బయో మైనింగ్, బయో రిమీడియేషన్ ప్రక్రియలను వేగవంతం చేసి, రికవర్డ్ మెటీరియల్ను శాస్త్రీయంగా వర్గీకరించి వినియోగించాలన్నారు. తదనంతరం వేస్ట్ టు ఎనర్జీ యూనిట్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్ఎఫ్) ప్లాంట్ల స్థాపనకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, అమలు దశకు తీసుకెళ్లాలని ఆదేశించారు. దేవనగర్ వద్ద మురుగు శుద్ధి కేంద్రం నిర్వహణను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) ప్రకారం మెరుగుపరచాలని, ట్రీటెడ్ వాటర్ నాణ్యతను నిరంతరం మానిటరింగ్ చేయాలని సూచించారు. అదేవిధంగా, సంబంధిత మౌలిక వసతుల నిర్వహణ బాధ్యతలను త్వరలో పబ్లిక్ హెల్త్ విభాగం నుండి కార్పొరేషన్కు బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ గుర్రప్ప, డిఈ యూ.వెంకటేశ్వర్లు, ఏఈ నాగశేష, నగరపాలక ఎస్ఈ రమణమూర్తి, కార్యదర్శి నాగరాజు, ఎంఈలు గిరిరాజ్, డిఈఈలు పవన్, ఏఈ వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు.

