ఘనంగా హోలీ పండుగ సంబరాలు..
1 min read
రమణీయం కామన్న ఊరేగింపు వేడుకలు.
వర్షాలు,పంటలు,దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలి.
ఆకట్టుకున్న చిన్నారుల వేషభూషణలు,యువకులు మజ్జిగ బండి,బయలాట.
హోళగుంద,న్యూస్ నేడు: మండల కేంద్రంలో స్థానిక శ్రీ ఉరవకొండ మహస్వాముల మఠం పరిసర ప్రాంతాల్లో హోలి పండుగ సందర్భంగా కర్ణాటక జానపద సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సాయంత్రం కామన్న ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగగా సాగింది. ముందుగా మఠం వద్ద కామన్నకు సీఐ రవిశంకర్ రెడ్డి, ఎస్ఐ దిలీప్ కుమార్,మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ,సర్పంచ్ తనయుడు పంపాపతి ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఏనుగు పై కామన్న విగ్రహాన్ని ఉంచి మేళా తాళలతో డప్పు వాయిద్యాలతో గ్రామ పురవిధుల్లో ఊరేగింపును ప్రారంభించారు.ఇందులో భాగంగా అక్కడి పెద్దలు, యువకులు ప్రదర్శించిన మజ్జిగ బండి,బయలు నాటకం,చిన్నారుల వివిధ వేశభూషణలు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి.అలాగే అర్ధరాత్రి ఉరవకొండ స్వామీ మఠం వద్దకు చేరుకొని కామన్న దహనం చేశారు.ఈ సందర్భంగా కార్యక్రమం యొక్క విశేషతలను అక్కడి ప్రజలను వివరణ కోరగా ఇది ఒక్క కర్ణాటక సంప్రదాయ ఉత్సవం,రతి మన్మథుల చరిత్రను తెలిపే కార్యక్రమం అన్ని తెలిపారు.ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరపడం వల్ల గ్రామంలో సుభిక్షంగా వర్షాలు కురిసి,పంటలు పుష్కలంగా వస్తాయని మరియు గ్రామం సస్యశ్యామలంగా కళకళలాడుతూ ఉంటుందని ప్రజల మాట.అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం రైతన్నలు తమ పంటలు చేతికందిన తర్వాత యువకులు,పెద్దలు కలిసి కట్టుగా ఏకమై ఆనందోత్సాహాలతో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు చెప్పారు.అలాగే మంగళవారం ఉదయం కామన్న మృతదేహం ఊరేగింపు,కామన్నకు పునర్జన్మ రావడంతో పెళ్లి ఊరేగింపు ఉదయం 11గంటలకు పెద్దలు,యువకులు ఆనందోత్సావంతో వసంతోత్సవం(రంగులు చల్లుకుని)తో కార్యక్రమాలు ముగుస్తాయని అక్కడి ప్రజలు చెప్పారు.కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రవిశంకర్ రెడ్డి, ఎస్సై దిలీప్ కుమార్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.

