ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా ఇల్లూరు లక్ష్మయ్య ఎన్నిక
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా కర్నూల్ నగరానికి చెందిన ఇల్లూరు లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభ 2026- 2028 సంవత్సరానికి గాను పదవిని రాయలసీమ జోన్ కు కేటాయించారు. ఇందులో భాగంగా కర్నూల్ నగరంలో ఉన్న ఆర్యవైశ్య మహాసభ రీజినల్ కార్యాలయమైన వాసవి ఆర్యవైశ్య హాస్టల్ నందు ఎన్నికల ప్రక్రియను నిన్న ఉదయం ప్రారంభించారు. ఈ ఎన్నికలకు అధికారిగా ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు వ్యవహరించారు. నామినేషన్ల కార్యక్రమంలో కర్నూలు నుండి ఇల్లూరు లక్ష్మయ్య, అనంతపురం జిల్లా నుండి ముడియం రమణ మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ముడియం రమణ నామినేషన్ బలపరిచిన వ్యక్తికి మహాసభలో సభ్యత్వం లేకపోవడం వల్ల టెక్నికల్ గా అతని నామినేషన్ను తిరస్కరణకు గురైనట్టు ఈరోజు స్కూటీని అనంతరం ఎన్నికల అధికారి పెనుగొండ సుబ్బరాయుడు తెలిపారు. దీంతో మిగిలిన ఏకైక అభ్యర్థి ఇల్లూరు లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఆయన ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఇల్లూరు లక్ష్మయ్యకు డిక్లరేషన్ ఫామ్ ను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని అన్నారు. ఆర్యవైశ్యుల పెద్దాయనగా గుర్తింపు పొందిన కొణిజేటి రోశయ్య అలంకరించినటువంటి స్థానానికి తాను ఎన్నిక కావడం మర్చిపోలేని అనుభూతి అన్నారు. పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆశీస్సులతో రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని లక్ష్మయ్య తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మహాసభలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని వాటిని సరిదిద్ది, విజయవాడలో కార్యాలయం ఏర్పాటుకు నడుం బిగిస్తామని తెలిపారు. అలాగే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహకారంతో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలలో ఆర్యవైశ్యుల యువతకు అవకాశాలు లభించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఎన్నిక కావడానికి సహకరించిన అందరికీ ఇల్లూరు లక్ష్మయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాశి అన్నపూర్ణ సత్ర సముదాయాల అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, ముడియం రమణ, పోతుల సురేష్, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, ఇల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

