మహిళల విద్యాభివృద్ధికి పాటుపడిన జ్యోతిబా పూలే
1 min read

మెరుగైన సమాజ స్థాపనకు కృషి చేశారు
ఏలూరులో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు
వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి , జిల్లాపరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ , ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్ లు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:సామజిక సంస్కరణలతో పాటు మహిళా విద్యకు పాటిపడిన మహా వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే లు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్ లు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ఆర్దికంగా గానీ, సామాజికం గానీ ఒక చైతన్యవంతమైన జీవితం సాగించేందుకు విద్య చాలా అవసరమని మహాత్మా జ్యోతిబా పూలే ఆనాడే చెప్పారని, చెప్పడమే కాకుండా దానిని ఆచరించారన్నారు. కుల, లింగ, వివక్షతకు తావు లేకుండా సమాన హక్కుల కోసం పోరాడారని, విద్య, సమానత్వం ద్వారానే సామాజిక, ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే జ్యోతిబా పూలే ఆలోచన విధానాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మహిళలు గుమ్మం దాటడానికి కూడా ఆలోచించే ఆ రోజులలో మహిళలు విద్యకు కృషిచేసిన మహా వ్యక్తి జ్యోతిబా పూలే అని. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని , వాటిని సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాలు అభ్యున్నతికి వారికి సామాజిక న్యాయం అందించేందుకు తన జీవితాన్ని పూలే అంకితం చేశారన్నారు. సమాజంలో అసమానతలు తోలగడానికి పూలే ఎంతో శ్రమించారన్నారు. బిసి ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు.కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం. జె.అభిషేక్ గౌడ, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా బి సి సంక్షేమ శాఖా అధికారి ఆర్. నాగరాణి , బి సి కార్బోరేషన్ ఈ డి ఎన్ .పుష్పాలత, సెట్ వెల్ సీఈఓ ప్రభాకర రావు, పర్యాటకాధికారి పట్టాభిరామయ్య, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, వివిధ సంఘాల నాయకులు సిహెచ్. కట్లయ్య, మేతర అజయ్ బాబు, వివిధ శాఖల అధికారులు, విద్యార్దిని విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.

